సరదాగా...
బయటే మంచి జట్టుంది!
ఈసారి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటతీరు దారుణంగా ఉంది. రోహిత్, పొలార్డ్ తప్ప ఒక్క ఆటగాడు కూడా సరిగ్గా ఆడటం లేదు. దీంతో సహజంగానే ఆ జట్టుకు ఓటములు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది కొత్త కోచ్గా పాంటింగ్ వచ్చాక ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
అయినా చెన్నైపై 183 పరుగులు చేసినా గెలవకపోవడంతో సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్పై జోకులు పేలుతున్నాయి. జట్టులో ఉన్నవాళ్లంతా తప్పుకుని జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్గా పని చేస్తున్నవాళ్లందరినీ మైదానంలోకి దించితే మేలనేది ఓ అభిమాని సూచన. మెంటార్లుగా సచిన్, కుంబ్లే... కోచ్లుగా పాంటింగ్, రాబిన్ సింగ్, జాంటీ రోడ్స్, షేన్బాండ్ ఈ జట్టుతో పని చేస్తున్నారు. ఈ ఆరుగురు దిగి ఆడితే ముంబై రాత మారుతుందని, మైదానంలో కంటే తమకు బయటే మంచి జట్టు ఉందని ఓ అభిమాని సెటైర్ వేశాడు.