భారత్ గెలుపే నాకు స్ఫూర్తి: రణతుంగ
న్యూఢిల్లీ: భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ ను గెలవడం తనకు స్ఫూర్తినిచ్చిందని శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నాడు. 1996లో తమ జట్టు వరల్డ్ కప్ అందుకోవడానికి భారత్ విజయమే స్ఫూర్తి అని చెప్పాడు.
'1983లో కపిల్ దేవ్ బృందం వన్డే ప్రపంచకప్ అందుకోవడం నాలో స్ఫూర్తిని రగిలించింది. భారత్ లాంటి జట్టు పటిష్టమైన వెస్టిండీస్ ను ఓడించి విజేతగా నిలిచింది. ఇండియా వరల్డ్ కప్ సాధించినప్పుడు శ్రీలంక ఎందుకు సాధించలేదని ప్రశ్నించుకున్నాను. తర్వాత 1996లో మేము ప్రపంచకప్ సాధించాం' అని రణతుంగ అన్నాడు.
శనివారం ఢిల్లీలో నిర్వహించిన 'సలామ్ క్రికెట్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి 1992లో పాకిస్థాన్ ప్రపంచకప్ సాధించడం కూడా తనకు ప్రేరణ కలిగించిందన్నాడు.