ధావన్ మెరుపులు..తొలి వన్డే కైవసం
దంబుల్లా:
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్ రాణించడంతో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో శిఖర్ ధావన్ 132(90), మెరుపులకు కెప్టెన్ కోహ్లీ 82(70) తోడవ్వడంతో శ్రీలంక నిర్ధేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక ఆరంభంలో నిలకడగా ఆడినప్పటికీ ఆపై భారత బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేసింది. ప్రధానంగా స్పిన్నర్ల దెబ్బకు లంక బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. భారత స్పిన్ త్రయం చాహల్, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్ లు లంక పతనాన్ని శాసించారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లతో సత్తా చాటగా, చాహల్, జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించారు. పేసర్ బూమ్రా రెండు వికెట్లు తీశాడు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో 217 పరుగుల సాధారణ లక్ష్యాన్నిమాత్రమే లంక నిర్దేశించగలిగింది.
217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(4) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 71 బంతుల్లోనే సెంచరీ చేయగా, కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. దీంతో భారత్ 28.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 220పరుగులు చేసి విజయం సాధించింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులకు ఓపెనర్లు గుణతిలకా, డిక్ వెల్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించి మంచి రన్ రేట్ ను బోర్డుపై ఉంచారు. కాగా, గుణతిలకా(35) అవుటైన తరువాత డిక్ వెల్లా కుదరుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే డిక్ వెల్లా(64) హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే డిక్ వెల్లా అవుటైన తరువాత లంకేయులు ఒక్కసారిగా తడబడ్డారు. 139 పరుగుల వద్ద లంక రెండో వికెట్ ను డిక్ వెల్లా రూపంలో కోల్పోగా, ఆపై వరుస విరామాల్లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. కుశాల్ మెండిస్(36), ఉపుల్ తరంగా(13), కపుగదెరా(1), హసరంగా(2)లు వరుసగా పెవిలియన్ చేరడంతో లంక స్కోరు మందగించింది. కాగా, ఏంజెలో మాథ్యూస్(36 నాటౌట్) కాస్త ఫర్వాలేదనిపించడంతో లంక రెండొందల మార్కును చేరింది.