ఇంగ్లండ్‌లో భారత్, పాక్ టెస్టు సిరీస్!


కరాచీ: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ రెండు భాగాలుగా జరగనుంది. వన్డే, టి20 సిరీస్ శ్రీలంకలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ వేదికయ్యే అవకాశాలున్నాయి. దుబాయ్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో ఇరు బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఇరు ప్రభుత్వాల నుంచి సిరీస్‌కు అనుమతి లభించేదాకా మీడియాకు ఎలాంటి వివరాలను వెల్లడించకూడదని బీసీసీఐ, పీసీబీ నిర్ణయం తీసుకున్నాయి.

 

తొలిసారిగా నిర్వహించబోతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో భారత ఆటగాళ్లు కూడా ఆడాలని పీసీబీ కోరుకుంటే ఆలోచిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్‌లో మినహా భారత ఆటగాళ్లను ఏ ఇతర విదేశీ టి20 లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. పీఎస్‌ఎల్ విషయంలో శుక్లా వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది.

 

కేంద్రానికి బీసీసీఐ లేఖ

న్యూఢిల్లీ: భారత, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్‌పై ఇరు బోర్డుల నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఇప్పుడు రెండు దేశాల ప్రభుత్వాల నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే పాక్ తమ ప్రభుత్వాన్ని అనుమతి కోరగా.. తాజాగా బీసీసీఐ కూడా కేంద్రానికి లేఖ రాసింది. బోర్డు కార్యదర్శి ఠాకూర్ ఈ విషయం తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top