భారత్ ర్యాంక్ 147
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్లో భారత్ స్థానం గణనీయంగా మెరుగుపడింది. గురువారం విడుదల చేసిన తాజా జాబితాలో 26 స్థానాలు ఎగబాకి 147వ ర్యాంక్లో నిలిచింది. గత నెలలో జరిగిన 2018 వరల్డ్కప్ క్వాలిఫయింగ్ రౌండ్లో నేపాల్పై గెలవడం భారత్కు కలిసొచ్చింది. 1993లో ఫిఫా ర్యాంకింగ్స్ మొదలైనప్పట్నించీ... భారత ఫుట్బాల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక మెరుగుదల. 1993, 96లో వరుసగా 29, 30 స్థానాలను మెరుగుపర్చుకుంది. ప్రపంచ చాంపియన్ జర్మనీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అర్జెంటీనా, బెల్జియం, కొలంబియా, బ్రెజిల్ టాప్-5లో ఉన్నాయి.