ఇక ఆ తప్పులు చేయం: రోహిత్ శర్మ
ఇండోర్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో తాము చేసిన చిన్న చిన్న పొరపాట్లతోనే ఓటమి పాలైనట్లు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. రేపు జరిగే రెండో వన్డేలో ఆ తరహా తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నాడు. ప్రపంచ వన్డే ర్యాంకింగ్ లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా.. నంబర్ వన్ స్థానానికి ఎదగాలంటే అనవసర తప్పిదాలను అధిగమించాల్సిన అవసరం ఉందన్నాడు.
' టీమిండియా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలంటే తప్పిదాలకు తావుండకూడదు. అందులో రెండో ప్రశ్నే లేదు. జట్టు సమిష్టిగా రాణించి గాడిలో పడాలి. ఒక చాంపియన్ జట్టు పదే పదే ఒకే తరహా తప్పిదాలు చేయడం కూడా సరికాదు. వాటిని రెండో వన్డేలో అధిగమించి మా సత్తా చాటుతాం' అని రోహిత్ తెలిపాడు. తొలి వన్డేలో తాను అజింక్యా రహానేతో కలిసి 149 పరుగుల చేసినా చివర్లో విఫలం చెందామన్నాడు. తాము మరికొంత సేపు క్రీజ్ లో ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవన్నాడు.