నేనే వైదొలిగా: జో డాస్

నేనే వైదొలిగా: జో డాస్ - Sakshi


 బీసీసీఐతో సఖ్యత ఉంది

 

 న్యూఢిల్లీ: బౌలింగ్ కోచ్ పదవి నుంచి తనను బీసీసీఐ తొలగించలేదని జో డాస్ చెప్పారు. జాతీయ అకాడమీ (ఎన్‌సీఏ)లో పని చేయడం ఇష్టంలేక తామే స్నేహపూర్వకంగా వైదొలిగామని స్పష్టం చేశారు. బీసీసీఐతో తనకు మంచి సఖ్యత ఉందన్నారు. అయితే ఇంగ్లండ్ టూర్‌లో వన్డే సిరీస్‌కు తనకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డు తీసుకున్న నిర్ణయంపై డాస్ మాట్లాడలేదు. ‘అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడదల్చుకోలేదు. అలా మాట్లాడం సరైంది కాదు కూడా. బోర్డుతో సమస్యలు పెట్టుకోవద్దని కోరుకుంటున్నా. ఎన్‌సీఏలో పని చేయమని అవకాశం ఇచ్చారు.



అయితే నేను కోరుకున్నది అది కాదు. కాబట్టి సామరస్యంగానే పక్కకు తప్పుకున్నా’ అని డాస్ వివరించారు. ‘హిందీ’ రాకపోవడంతో బీసీసీఐ తనను తొలగించిందని సోమవారం ఆసీస్ మీడియాలో కథనాలు రావడంతో వాటిపై డాస్ వివరణ ఇచ్చారు. తనపై బోర్డుకు నమ్మకం సడలడానికి హిందీ కారణమని ఒక్కరు కూడా తన దృష్టికి తీసుకురాలేదన్నారు. ‘రవి శాస్త్రి నివేదిక బయటకు లీక్ అయ్యిందని ఒకే ఒక్కసారి విన్నా. అందులో ఈ కారణం ఉందేమో. కానీ దాన్ని నేను చూడలేదు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరూ నాతో చెప్పలేదు’ అని డాస్ వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top