చివరి మ్యాచ్ ఆడానేమో!

చివరి మ్యాచ్ ఆడానేమో! - Sakshi


టి20 ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందా..! శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ కనీసం బంతిని ముట్టుకోవడానికి భయపడి చాలా వృథా చేశాడు. అప్పటి నుంచి మళ్లీ అతను భారత్‌కు ఆడలేదు. అయితే భవిష్యత్‌లోనూ అతను ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని యువీ కూడా గుర్తించాడు. భారత్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశానేమోనని అంటున్నాడు.

 

 మొహాలీ: మూడున్నర నెలలు గడిస్తే మళ్లీ వన్డే ప్రపంచకప్‌కు తెరలేస్తుంది. 2011లో భారత్ ఈ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన యువరాజ్ ఇప్పుడు కనీసం జట్టులోకి వస్తాడనే ఆశతో కూడా లేడు. గత మూడేళ్లలో ఎన్నో మార్పులు. క్యాన్సర్ బారిన పడ్డ యువరాజ్... తిరిగి కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ పూర్వపు ఆట మాత్రం తిరిగి రాలేదు. అయినా దేశవాళీ మ్యాచ్‌లు, ఐపీఎల్ ద్వారా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.



వివిధ అంశాలపై యువరాజ్ చెప్పిన విశేషాలు అతడి మాటల్లోనే...

 ప్రయత్నిస్తూనే ఉంటా: భారత్ తరఫున నా చివరి మ్యాచ్ ఆడేశానేమో. ప్రస్తుతం ఉన్న పోటీలో మళ్లీ జాతీయ జట్టులోకి రావడం సులభం కాదు. అయితే నా ప్రయత్నం మానుకోను. గతంలో నేను చాలా లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని చేరాను. ఎప్పుడూ ఓ లక్ష్యంతోనే ఆడుతూ ఉండాలి. లేకపోతే జీవితం నిరాశలోకి వెళుతుంది. ప్రస్తుతం కూడా నా లక్ష్యం భారత్‌కు మళ్లీ ఆడటమే. ప్రయత్నాలను మాత్రం మానుకోను.



 శరీరం మారింది: గత ప్రపంచకప్ తర్వాత నేను క్యాన్సర్ వల్ల జీవితం కోసం పోరాడాను. ఆ సమయంలో మళ్లీ క్రికెట్ ఆడతానని అనుకోలేదు. కానీ తిరిగి ఆడగలిగాను. అయితే నా పూర్వపు స్థాయిలో ఆడలేకపోయాననేది వాస్తవం. 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. నిరంతరం ఫిట్‌గా ఉండటం కష్టం. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక నా శరీరం చాలా మారింది. ప్రణాళిక ప్రకారం కష్టపడటం, ఆశావహంగా ఆలోచించడం ముఖ్యం. వీటితోనే సానుకూల దృక్పథంతో ముందుకు వెళతాను.



 అప్పటికంటే ఫిట్‌గానే: 2011 ప్రపంచకప్ నాటితో పోలిస్తే ఇప్పుడు నేను మంచి ఫిట్‌నెస్‌తోనే ఉన్నాను. ఒక ఊపిరితిత్తితో ఆడటం, రెండింటితో ఆడటంలో తేడా ఉంది కదా. వేరే వాళ్ల నమ్మకాలతో అంచనాలతో నాకు పని లేదు. నా మీద నాకు నమ్మకం ఉండాలి. అది నాలో ఎప్పుడూ ఉంది.



 అకాడమీల ఏర్పాటు: దేశంలో యువ క్రికెటర్లకు మెరుగైన సౌకర్యాలు ఉండాలనేది నా అభిప్రాయం. నా అదృష్టం కొద్దీ మా నాన్న దగ్గర నేను శిక్షణ పొందా. కానీ చాలా మంది కుర్రాళ్లు సౌకర్యాల కోసం ఇబ్బంది పడుతున్నారు. నైపుణ్యం ఉండి కూడా అవకాశాలు లేని కుర్రాళ్లను నా అకాడమీల ద్వారా వెలుగులోకి తేవాలనేది ప్రధాన ఉద్దేశం.



 నైట్ పార్టీలు, విమర్శలు: సాధారణంగా అభిమానులు పుకార్లను ఇష్టపడతారు. అందుకే నెగెటివ్ వార్తల కోసం మీడియా కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే మనం చేసే చాలా మంచి విషయాలను పట్టించుకోరు. అయితే ఎవరో ఏదో అనుకుంటున్నారనే ఆందోళన నాకు ఎప్పుడూ కలగలేదు. ముఖ్యంగా క్యాన్సర్ నుంచి తేరుకున్నాక నేను చాలా కార్యక్రమాలు చేపట్టాను. వీటి గురించి ప్రచారం అవసరం లేదు. అవసరం ఉన్నవారికి సేవ దొరికితే చాలు.



 జహీర్, భజ్జీ, సెహ్వాగ్ అందరూ ఒకే పడవలో:

 అవును. మేం అంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. భారత్‌కు ఆడినప్పటి సంగతుల గురించి మేం కలిసిన ప్రతిసారీ మాట్లాడుకుంటున్నాం. మేం అందరం కూడా ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. మేం ఆటను ప్రేమిస్తాం.



 ప్రపంచకప్ అవకాశాలు: జట్టులోకి రావడం అనేది నా చేతుల్లో ఎప్పుడూ లేదు. ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయడానికి ముందు దేశవాళీలో పెద్దగా మ్యాచ్‌లు కూడా లేవు. కాబట్టి దాని గురించి ఆలోచించడం అనవసరం. రంజీట్రోఫీ గురించి ప్రస్తుతం ఆలోచిస్తున్నాను.



 ఇది నాకు రెండో జీవితం: క్యాన్సర్ నుంచి కోలుకుని ఇలా ఉండటం... కచ్చితంగా భగవంతుడు నాకు ఇచ్చిన రెండో జీవితం ఇది. తిరిగి క్రికెట్ ఆడటానికే ఈ జీవితం లభించిందా? లేక క్యాన్సర్ పేషంట్లలో ధైర్యం పెంచడానికి లభించిందా? అనేది తెలియదు. ఏమైనా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు సాగడం, క్రికెట్ ఆడటం, సేవా కార్యక్రమాలు చేయడం కొనసాగిస్తాను.

 

 2011 ప్రపంచకప్ నాటితో పోలిస్తే ఇప్పుడు నేను మంచి ఫిట్‌నెస్‌తోనే ఉన్నాను. ఒక ఊపిరితిత్తితో ఆడటం, రెండింటితో ఆడటంలో తేడా ఉంది కదా. వేరే వాళ్ల నమ్మకాలతో అంచనాలతో నాకు పని లేదు. నా మీద నాకు నమ్మకం ఉండాలి. అది నాలో ఎప్పుడూ ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top