హైదరాబాద్ ఘన విజయం
హైదరాబాద్: ఐపీఎల్ -8లో భాగంగా ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై 22 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. జట్టులోని ఆటగాళ్లంతా సమష్టిగా రాణించి హైదరాబాద్ విజయానికి కృషి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హైదరాబాద్ నిర్దేశించిన భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించటంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే తడబాటుకు గురై పూర్తి ఓవర్లు ఆడి ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాటింగ్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి వీరంగం చేశాడు. ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడి 28 బంతుల్లోనే 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 61 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (37), నమన్ ఓజా (20), ఇయాన్ మోర్గాన్ (31) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు, సురేశ్ రైనా, పవన్ నేగి, నెహ్రా తలో వికెట్ పడగొట్టారు.
చెన్నై బ్యాటింగ్
హైదరాబాద్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరంభం నుంచి వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డుప్లెసి (33) టాప్ స్కోరర్. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, హెన్రిక్స్ రెండేసి వికెట్లు, అశిష్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టాడు.