హైదరాబాద్ మూడో విజయం
మొహాలీ: ఐపీఎల్-8లో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 20 పరుగులతో కింగ్స్ లెవెన్ పంజాబ్పై విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు130 పరుగులే చేయగలిగింది. లక్ష్యసాధనలో పంజాబ్ ఆరంభంలోనే తడబడింది. టాపార్డర్ విఫలమైంది. జట్టులో వృద్ధిమాన్ సాహా (42) టాప్ స్కోరర్. కెప్టెన్ బెయిలీ 22, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో బౌల్ట్ మూడు, భువనేశ్వర్ రెండు వికెట్లు తీశారు. ఈ టోర్నీలో హైదరాబాద్ 7 మ్యాచ్లాడి మూడు విజయాలు సాధించింది. 7 మ్యాచ్లాడిన పంజాబ్ రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ 35 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో హాఫ్ సెంచరీ చేశాడు. హెన్రిక్స్ 30, నమన్ ఓజా 28 పరుగులు చేశారు. చివర్లో ఆశీష్ రెడ్డి (8 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 22 నాటౌట్) బ్యాట్ ఝుళిపించాడు. కాగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లు అక్షర్ పటేల్, మిచెల్ జాన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.