క్రికెట్‌కు కనిత్కర్ వీడ్కోలు

క్రికెట్‌కు కనిత్కర్ వీడ్కోలు


న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై 1998లో ఉత్కంఠ పోరులో చివరి బంతిని బౌండరీకి పంపి భారత్‌ను గెలిపించిన హృషికేశ్ కనిత్కర్... అప్పట్లో అభిమానుల దృష్టిలో హీరోగా నిలిచాడు. అయితే భారత్ తరఫున కేవలం మూడేళ్లు మాత్రమే ఆడిన ఈ బ్యాట్స్‌మన్ ఇంతకాలానికి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున తను రెండు టెస్టులతో పాటు 34 వన్డేలు ఆడాడు. రంజీల్లో చివరిసారిగా 2013లో రాజస్తాన్ తరఫున ఆడాడు.

 

  రంజీల్లో ఎనిమిది వేలకు పైగా పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్లలో తనూ ఒకడు. అలాగే 28 శతకాలతో పాటు రంజీ చరిత్రలో ఎలైట్, ప్లేట్ లీగ్ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్‌గానూ నిలిచాడు. బ్యాటింగ్ చేయడంలో సమస్య లేకున్నా ఫీల్డింగ్‌లో చురుగ్గా కదల్లేకపోతున్నానని రిటైర్మెంట్ వెనుక కారణాన్ని 40 ఏళ్ల కనిత్కర్ తెలిపాడు. ఓవరాల్‌గా తను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ జట్లకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం కోచింగ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్న ఈ మహారాష్ట్ర ఆటగాడు ఇప్పటికే బీసీసీఐ అండర్-19 క్రికెటర్లకు సంబంధించి ఈస్ట్ జోన్ శిబిరాన్ని నిర్వహించాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top