కరుణ్ నాయర్.. టీ అమ్మడానికి వస్తున్నాడా?

కరుణ్ నాయర్.. టీ అమ్మడానికి వస్తున్నాడా?


చెన్నై:కరుణ్ నాయర్.. ఇప్పుడు భారత్ క్రికెట్ నుంచి ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. దాంతో పాటు తొలి సెంచరీని ట్రిపుల్ గా మార్చిన  ఏకైక భారత క్రికెటర్, ప్రపంచ మూడో బ్యాట్స్మన్ గా నిలిచాడు. ఇటీవల చెన్నైలో ఇంగ్లండ్ తో జరిగిన చివరిదైన ఐదో టెస్టులో నాయర్ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగిపోయి ట్రిపుల్ నమోదు చేశాడు. అయితే చెన్నై టెస్టుకు ముందు నాయర్కు వింత అనుభవం ఎదురైంది. ఆ టెస్టు మ్యాచ్కు ముందు నాయర్ టీ అమ్మడానికి చెన్నై వస్తున్నాడంటూ తమిళనాడులో సెటైర్లు వెలుగుచూశాయి.



సోషల్ మీడియాలో నాయర్ పై జోక్ వేస్తూ పలువురు తమిళనాడు నెటిజన్లు ఎంజాయ్ చేశారు. 'నాయర్ కేవలం టీ అమ్మడానికి చెన్నై వస్తున్నాడా?, టీ షాపు అతనికి కరెక్ట్గా సెట్ అవుతుంది' అంటూ నెటిజన్లు జోక్స్ వేసుకున్నారు. అయితే ఆ విమర్శలకు నాయర్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అతను ఆడిన తొలి రెండు టెస్టుల్లో వైఫల్యం చెందడమే నాయర్ పై జోక్లకు బీజం వేసింది. అయితే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నాయర్ ఏకంగా ట్రిపుల్ కొట్టి మరీ సెటైర్లను తిప్పికొట్టాడు.



నాయర్పై జోక్స్ వేసుకోవడంపై అతని కోచ్ బి శివానందా అసంతృప్తి వ్య్తక్తం చేశాడు. ఎక్కడైనా వైఫల్యం అనేది ఉంటుందనేది గ్రహిస్తే  మంచిదంటూ చురకలు వేశాడు. ఈ తరహా కామెంట్లు ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించాడు. ఇలా జోక్స్ వేసుకోవడం వల్ల ఆయా ప్రజల మైండ్ సెట్ను బయటపెడుతుందే తప్ప ఇంకేమి కలిసిరాదన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top