చివరకు ఆతిథ్య జట్లే మిగిలాయి
ప్రపంచ కప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా పోరాటం ముగిసింది. హాట్ టైటిల్ ఫేవరెట్ దక్షిణాఫ్రికా అంతులేని వేధనతో నిష్ర్కమించింది. మాజీ చాంప్స్ వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక క్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టాయి. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అయితే లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. 14 జట్లు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో చివరకు ఆతిథ్య జట్లే టైటిల్ రేసులో మిగిలాయి. ఈ నెల 29న మెల్బోర్న్లో జరిగే గ్రాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆసీస్ ఇప్పటి వరకు 4 ప్రపంచ కప్లు గెలవగా, కివీస్ తొలిసారి ఫైనల్ చేరింది. తాజా ఈవెంట్లో ఈ రెండు జట్లూ గ్రూపు-ఎలో ఆడాయి. లీగ్ దశలో కివీస్.. ఆసీస్ను ఓడించింది. కివీస్ ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరగా, ఆసీస్ ఓ మ్యాచ్లో మాత్రం ఓడింది. ఆరు లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గిన కివీస్ క్వార్టర్స్, సెమీస్లోనూ సంచలన విజయాలు సాధించింది. అయితే ఈ మ్యాచ్లన్నీ స్వదేశంలో, చిన్న మైదానాల్లో జరిగాయి. ఫైనల్ సమరం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతోంది. ఫైనలిస్టులు ఆసీస్, కివీస్ సమవుజ్జీలుగా కనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ కొత్త చాంపియన్గా అవతరిస్తుందా? లేక ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలస్తుందా అన్న విషయం 29న తేలనుంది. ఏదేమైనా ఆతిథ్య జట్టే ప్రపంచ చాంపియన్ కాబోతోంది.