యువ హాకీ జట్టుకు నజరానా
న్యూఢిల్లీ: మలేషియాలో జరిగిన ఆసియా కప్ జూనియర్ హాకీ టైటిల్ ను గెలిచిన భారత యువ జట్టుకు హాకీ ఇండియా(హెచ్ఐ) నజరానా ప్రకటించింది. ఆ టోర్నీలో పాల్గొన్న ప్రతీ ఆటగాడికి లక్ష రూపాయిల చొప్పున ఇస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దీంతో పాటు హకీ చీఫ్ కోచ్ కు రూ. 50,000ల నగదును బహుమతిగా ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హకీ ఇండియా అధ్యక్షుడు నరీందర్ దుర్వ్ బత్రా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
కాగా, ఈ టోర్నీలో విశేష ప్రతిభ కనబరిచిన హర్మన్ ప్రీత్ సింగ్, గోల్ కీపర్ వికాస్ దాహియాలకు అదనంగా మరో లక్ష రూపాయిలను కానుకగా ఇస్తున్నట్లు తెలిపారు. ఓవరాల్ గా ఆసియన్ కప్ ఈవెంట్ లో హర్మన్ ప్రీత్ 15 గోల్స్ తో ఆకట్టుకోగా, వికాస్ అత్యుత్తమ గోల్ కీపర్ గా నిలిచాడు. ఆదిదివారం పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో భారత హాకీ జట్టు టైటిల్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ జట్టు 6-2 తేడాతో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. ఇందులో హర్మన్ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.