ఆమ్లా, రోసౌ శతకాల మోత

ఆమ్లా, రోసౌ శతకాల మోత


* దక్షిణాఫ్రికా భారీ విజయం

* విండీస్‌పై 4-1తో సిరీస్ కైవసం


సెంచూరియన్: సిరీస్‌లో రెండోసారి ఓపెనర్ హషీమ్ ఆమ్లా (105 బంతుల్లో 133; 11 ఫోర్లు; 6 సిక్సర్లు), రిలీ రోసౌ (98 బంతుల్లో 132; 9ఫోర్లు; 8 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో వెస్టిండీస్‌తో జరిగిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 131 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బుధవారం సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 42 ఓవర్లలో ఐదు వికెట్లకు 361 పరుగులు సాధించింది. వర్షం కారణంగా ఎనిమిది ఓవర్లు తగ్గించారు.



ఆమ్లా, రోసౌ మూడో వికెట్‌కు 247 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. రస్సెల్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ 37.4 ఓవర్లలో 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి బంతికే గేల్ వెనుదిరగ్గా... శామ్యూల్స్ (47 బంతుల్లో 50; 1 ఫోర్; 4 సిక్సర్లు), నర్సింగ్ డియోనరైన్ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. వేన్ పార్నెల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. రోసౌకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top