ముందే... చేసేశారు!


మెల్‌బోర్న్: సమయం ఉదయం 9 గంటలు... అడిలైడ్ విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు... పుష్పగుచ్ఛాలతో లైసన్ అధికారుల ఎదురుచూపులు... లోపలా, బయటా ఎస్కార్ట్ సిబ్బంది హడావుడి... గ్యాలరీలో మోహరించిన మీడియా కెమెరాలు... తమ అభిమాన క్రికెటర్లను ఫొటోలు తీసుకునేందుకు ఫోన్లను పట్టుకుని బారులు తీరిన భారత అభిమానులు... జట్టు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న పోలీసులు... ఇక అందరి చూపు సింగపూర్ నుంచి భారత జట్టును తీసుకొస్తున్న విమానంపైనే... సీన్ కట్ చేస్తే... గంట గడిచిపోయింది.



కానీ విమానం రాలేదు.... భారత క్రికెటర్లూ దిగలేదు. ఏం జరిగిందబ్బా అని ఆరా తీస్తే... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సమాచార లోపం వల్ల సాయంత్రం చేయాల్సిన ఏర్పాట్లను ఉదయాన్నే చేశారని తేలింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు భారత్ జట్టు అడిలైడ్‌కు రావాల్సి ఉంది. దీంతో చేసేదేమీ లేక అందరూ నిరాశతో వెనుదిరిగిపోయారు. ఈ మొత్తం సీన్‌లో కొసమెరుపు ఏంటంటే... వీళ్లు హడావుడి చేస్తున్న సమయంలో విరాట్‌సేన సింగపూర్‌లో కనీసం విమానం కూడా ఎక్కకపోవడం...! భారత జట్టు శనివారం సాయంత్రం ఆడిలైడ్‌కు చేరుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top