అంకిత్ కుటుంబానికి గంగూలీ సాయం


కోల్‌కతా : ఈ ఏడాది బీసీసీఐ నుంచి తనకు రావాల్సిన పెన్షన్ మొత్తాన్ని ఇటీవల మరణించిన బెంగాల్ అండర్-19 క్రికెటర్ అంకిత్ కేసరి కుటుంబానికి ఇవ్వాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిర్ణయించుకున్నాడు. అలాగే రాబోయే ఏళ్లలో బోర్డు నుంచి తనకు లభించే పెన్షన్ మొత్తాన్ని కూడా గాయపడిన ఆటగాళ్ల చికిత్స కోసం ఖర్చు చేయనున్నాడు. క్యాబ్‌లో రిజిస్టర్ అయిన ఆటగాళ్లకు మాత్రమే ఈ మొత్తాన్ని వెచ్చించనున్నాడు. బీసీసీఐ పెన్షన్ స్కీమ్ ప్రకారం టెస్టు మాజీ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 4 లక్షల 20 వేలు లభిస్తాయి.



మైదానంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్లే అంకిత్ మరణించాడని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాటిని మెరుగుపరుస్తానని క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న దాదా హామీ ఇచ్చాడు. ఇందుకోసం అత్యాధునిక వసతులతో కూడిన 3 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తామని చెప్పాడు. మరోవైపు అంకిత్ కుటుంబానికి క్యాబ్ తరఫున రూ.10 లక్షలు అందజేయనున్నట్లు కోశాధికారి బిస్వరూప్ దేవ్ వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top