పోలీసుల అదుపులో ‘ఫిఫా’ అధికారులు
ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు
జ్యూరిచ్ : అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా)లో కలకలం చోటు చేసుకుంది. భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఫిఫా ఉపాధ్యక్షుడితో పాటు మరో ఆరుగుర్ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యూఎస్ అధికారుల ఆదేశాల మేరకు సమాఖ్య ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. నేటి నుంచి జరగనున్న ఫిఫా సమావేశాల కోసం జ్యూరిచ్లోని ఓ లగ్జరీ హోటల్లో ఉన్న వీళ్లను స్విస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మంది ఫుట్బాల్ అధికారులతో పాటు మరో 14 మంది ఫిఫాలో అవినీతికి పాల్పడుతున్నారని యూఎస్ అధికారులు తెలిపారు.
2018, 2022 ప్రపంచకప్ హక్కులను రష్యా, ఖతార్లకు కట్టబెట్టేందుకు వీళ్లు దాదాపు 100 మిలియన్ డాలర్లపైనే లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ కారణంగానే 2010లో ఫిఫా ఈ దేశాలకు అనుగుణంగా ఓటు వేసిందన్నారు. దీనికి సంబంధించిన ఫైల్స్, ఈ మెయిల్స్ను విచారణ కోసం స్విస్ పోలీసులు సీజ్ చేశారు. అలాగే సాకర్కు సంబంధించిన వివిధ టోర్నీల మీడియా, మార్కెటింగ్ హక్కుల కోసం ముడుపులు స్వీకరించినట్లు సమాచారం. మరోవైపు అరెస్టుల నేపథ్యంలో ప్రపంచకప్ వేదికలను మార్చే ప్రసక్తే లేదని ఫిఫా అధికార ప్రతినిధి గ్రెగెరియో అన్నారు. ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై విచారణ లేదు కాబట్టి శుక్రవారం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పాల్గొంటారని చెప్పారు.