డు ప్లెసిస్, డుమినీలకు విశ్రాంతి
కేప్టౌన్:త్వరలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ల ట్వంటీ 20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి కీలక ఆటగాళ్లు డు ప్లెసిస్, జేపీ డుమినీలకు విశ్రాంతినిచ్చారు. తమ రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించుకునే క్రమంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా క్రికెట్ సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ మేరకు ఆరుగురు కొత్త ఆటగాళ్లను ట్వంటీ 20 స్క్వాడ్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
'మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో పలువురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చాం. అసలు మా క్రికెట్ బలం ఎంతవరకూ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. కొత్త ఆటగాళ్లతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా. డు ప్లెసిస్, డుమినీ, ఆమ్లా, ఏబీ డివిలియర్స్లతో పాటు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు శ్రీలంకతో సిరీస్లో ఆడటం లేదు. మా 'ఎ' జట్టులో ఆటగాళ్లను ఎంపిక చేద్దామనే విషయాన్ని మా సహచర కోచ్లకు తెలియజేశాను.
కొత్తగా జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు తొలి రోజు స్కూల్ వెళ్లిన ఫీలింగ్ ఉంటుంది. దేశం కోసం ఆడాలని చాలా మంది యువ క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు. అది మాకు ఎంతో ఉత్సాహాన్ని కల్గిస్తుంది' అని దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ డామిన్గో పేర్కొన్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య మూడు ట్వంటీ 20ల సిరీస్ ఆరంభం కానుంది.