సమరానికి సన్నద్ధం!
నేటినుంచి యాషెస్ తొలి టెస్టు
కార్డిఫ్: క్రికెట్ చరిత్రలో చిరకాల వైరానికి మరోసారి సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ నేడు ప్రారంభం కానుంది. 2013లో సొంతగడ్డపై ఆస్ట్రేలియా 5-0తో గెలిచి యాషెస్ను సొంతం చేసుకోగా, తమ దేశంలో గత మూడు వరుస యాషెస్ సిరీస్లనూ గెలుచుకున్న ఇంగ్లండ్ రికార్డు ఘనంగా ఉంది.
సిరీస్లో ఆస్ట్రేలియా ఫేవరెట్గా కనిపిస్తున్నా...ఇంగ్లండ్ ఆట గాళ్లు కూడా ఫామ్లో ఉన్నారు. తొలిసారి ఒక ఆస్ట్రేలియన్ (ట్రెవర్ బెలిస్) ఇంగ్లండ్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తుండటంతో వ్యూహ ప్రతివ్యూహాలపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో గత ఆరు టెస్టుల్లో 1052 పరుగులు చేసిన స్టీవెన్ స్మిత్తో పాటు పేసర్ మిషెల్ స్టార్క్పై అందరి దృష్టీ నిలిచింది. గత ఏడాది కాలంలో 1318 పరుగులు చేసిన ఇంగ్లండ్ యువ బ్యాట్స్మన్ జో రూట్ కూడా అద్భుత ఫామ్లో ఉన్నాడు. అటు కెప్టెన్గా, ఇటు బ్యాట్స్మన్గా కూడా కుక్ కెరీర్కు ఈ సిరీస్ కీలకం కానుంది. గత యాషెస్లో ఆఖరి టెస్టు ఆడిన ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పుడు జట్టులో ఉన్నారు.