ఓజా బౌలింగ్‌పై సందేహం

ఓజా బౌలింగ్‌పై సందేహం


ముంబై: భారత క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇల్లీగల్ యాక్షన్ కమిటీ’ సభ్యుడైన మాజీ అంపైర్ ఏవీ జయప్రకాశ్, ఒక ఇంటర్వ్యూలో ఓజా పేరు వెల్లడించారు.  మోచేయిని పరిమితికి మించి వంచుతూ ఓజా బౌలింగ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బీసీసీఐ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.



అయితే కొద్ది రోజులుగా ఓజా దీనిని సరిదిద్దుకునే పనిలో ఉన్నట్లు, ఎన్‌సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ‘చాన్నాళ్ల క్రితమే ఓజా బౌలింగ్‌లో సందేహాలు నెలకొన్నాయి. అతను దానిని సరిదిద్దుకొని మళ్లీ జట్టులోకి వస్తూ ఉన్నా... నిబంధనల ప్రకారం చూస్తే ప్రతీ సారి అతని బౌలింగ్‌ను అనుమానించాల్సి వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. సచిన్ ఆఖరి టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అనంతరం ఓజా మరో టెస్టు ఆడలేదు. ప్రస్తుతం అతను దులీప్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ ఆడేందుకు హర్యానాలోని రోహ్‌టక్‌లో ఉన్నాడు.



ఓజా తన బౌలింగ్‌లో మార్పులు చేసుకొని కొత్త యాక్షన్‌తోనే ఈ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో ఓజా బరిలోకి దిగిన తర్వాత అతని యాక్షన్‌పై ఉన్న సందేహాలు తొలగిపోయే అవకాశం ఉంది. మరో వైపు దీనిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖండించింది. ‘ఓజాపై మీడియా కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తోంది. అతని బౌలింగ్‌పై బీసీసీఐ మాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిజంగానే సందేహముంటే అతడిని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసేవారు కాదు’ అని హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ స్పష్టం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top