శ్రీలంక 117 ఆలౌట్
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 66/2
పల్లెకెలె: సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు పేలవ ఆటతీరును ప్రదర్శించింది. మంగళవారం తొలిరోజు బ్యాటింగ్ చేపట్టిన లంక తమ తొలి ఇన్నింగ్స్లో 34.2 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ నాథన్ లియోన్ (3/12), పేసర్ హాజెల్వుడ్ (3/21) ధాటికి లంక బ్యాట్స్మెన్ ఎవరూ నిలబడలేకపోయారు. ధనంజయ డి సిల్వ (24) టాప్ స్కోరర్. ఈ మైదానంలో లంక జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. లంచ్ విరామానికి 84/5 పరుగులతో ఉన్న లంక ఆ తర్వాత 6.2 ఓవర్లలోనే మిగతా వికెట్లను కోల్పోయింది.
స్టార్క్, ఓ నీఫ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో రెండు వికెట్లకు 66 పరుగులు చేసింది. స్మిత్ (28 బ్యాటింగ్), ఖవాజా (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆఖరి సెషన్ జరగలేదు.