కుదురుకుంటారా!

కుదురుకుంటారా!


నేడు మిడిలెసెక్స్‌తో భారత్ ప్రాక్టీస్ వన్డే

లండన్: ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఘోరంగా ఓడిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు మిడిలెసెక్స్‌తో ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే సిరీస్‌కు ముందు ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో భారత్ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దాదాపుగా వన్డేల్లో ఆడే తుది జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టెస్టుల్లో ఆడిన పది మందికి తోడుగా ఏడుగురు కొత్త ఆటగాళ్లు జట్టుతో చేరారు. రైనా, రాయుడు, మోహిత్, ధావల్, శామ్సన్, కరణ్ శర్మ, ఉమేశ్‌లు ఇందులో ఉన్నారు.



అయితే వీళ్లలో ఎంత మందికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టెస్టుల్లో ఓటమితో జట్టులో ఆత్మ విశ్వాసం పూర్తిగా కొరవడింది. ఓపెనర్ ధావన్‌తో పాటు కోహ్లిల ఫామ్ కలవరపెడుతోంది. రోహిత్ కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అయితే ఈ త్రయం కుదురుకునే అంశంపైనే ఇంగ్లండ్‌లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. బౌలింగ్ కూడా గాడిలో పడాల్సి ఉంది.  ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోని ఆడే అవకాశాలు కనబడటం లేదు. అయితే తొలి వన్డేల్లో మాత్రం సీనియర్లను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం.

 

ప్రాక్టీస్‌కు ఏడుగురు డుమ్మా

కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టారు. గురువారం లార్డ్స్ నర్సరీ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రాక్టీస్‌కు ధోని, ధావన్, రోహిత్, కోహ్లి, అశ్విన్, జడేజా, షమీలు గైర్హాజరయ్యారు.  రహానే, భువనేశ్వర్, స్టువర్ట్ బిన్నీలతో పాటు యువ ఆటగాళ్లు మాత్రం నెట్స్‌లో చెమటోడ్చారు. బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు జో డేవిస్, ట్రెవర్ పెన్నీల ఆధ్వర్యంలో స్లిప్ క్యాచ్‌లు, త్రో డౌన్స్ సాధన చేశారు. తర్వాత బ్యాటింగ్, బౌలింగ్‌కు పదును పెట్టారు. సంజూ శామ్సన్ వికెట్ కీపింగ్‌తో పాటు స్లిప్‌లో రైనా, రహానేతో కలిసి క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top