విరాట్ కోహ్లీ సేనకు చేదువార్త

విరాట్ కోహ్లీ సేనకు చేదువార్త


న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి, నాలుగో మ్యాచ్‌ ఇరు జట్లకు ఎంతో కీలకం. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి టెస్టుకు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. సాధారణంగా భారత గడ్డపై పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలిస్తుంటాయి. టీమిండియా కెప్టెన్, ఆటగాళ్లు కూడా ఇలాంటి పిచ్‌లనే కోరుకుంటారు. ఈ సిరీస్‌లో కూడా స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు. అయితే నాలుగో టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ సేనకు ఓ చేదువార్త! ధర్మశాల పిచ్‌కు స్పినర్లకు పెద్దగా అనుకూలించదట! ఇక్కడ పేసర్లకు ఎక్కువగా సహకరిస్తుందని క్యూరేటర్ సునీల్ చౌహాన్ స్పష్టం చేశాడు.



ధర్మశాల్ పిచ్‌ సహజంగానే పేసర్లకు అనుకూలిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చౌహాన్ చెప్పాడు. ఇటీవల ఈ వేదికపై జరిగిన రంజీ మ్యాచ్‌లలో కూడా ఇదే విషయం రుజువైందని గుర్తు చేశాడు. టెస్టు మ్యాచ్‌కు అవసరమైన పిచ్‌ను రూపొందించేందుకు ప్రయత్నించామని చెప్పాడు. తొలి రెండు రోజు పేసర్లకు, తర్వాత బ్యాట్స్‌మెన్‌కు, స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలిపాడు. ఈ వార్త కంగారూలకు సంతోషం కలిగించేదే. గాయం కారణంగా మిచెల్ స్టార్క్ జట్టుకు దూరమైనా, హజ్లెవుడ్, కమిన్స్ సత్తాచాటుతారని విశ్వాసంతో ఉన్నారు.



భారత బ్యాట్స్‌మెన్‌ను తమ పేసర్లు కట్టడి చేస్తారని భావిస్తున్నారు. ఇక భారత్ విషయానికొస్తే ఎక్కువగా స్పిన్నర్లపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సిరీస్‌లో పేసర్ల కంటే ఎక్కువగా స్పిన్ బౌలర్లు అశ్విన్, జడేజాలే కీలక పాత్ర పోషించారు. కాగా బీసీసీఐ చీఫ్‌ క్యూరేటర్ దల్జీత్ సింగ్ ఇప్పటికే ధర్మశాల చేరుకుని పిచ్ తయారీని పర్యవేక్షిస్తున్నాడు. వికెట్ తయారీలో మార్పులు చేయిస్తారా లేక చౌహాన్‌పైనే పూర్తి బాధ్యతలు వదిలిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top