ఢిల్లీ, నార్త్ఈస్ట్ మ్యాచ్ ‘డ్రా'
న్యూఢిల్లీ: ఆరంభం నుంచే ఎదురుదాడులు చేసినా... కీలక సమయంలో వ్యూహానికి తగ్గట్టుగా ఆడలేకపోయిన ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీ జట్లు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డ్రాతో సరిపెట్టుకున్నాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. యువకులతో కూడిన నార్త్ జట్టు ఎక్కువ భాగం బంతిని ఆధీనంలో ఉంచుకున్నా ప్రత్యర్థి శిబిరంలోకి చొచ్చుకుపోలేకపోయింది.
ఇరుజట్లు హోరాహోరీగా దాడులు చేసుకున్నా... ప్రథమార్ధంలో గోల్స్ మాత్రం చేయలేకపోయాయి. ఇక రెండో అర్ధభాగంలో నార్త్ కాస్త రక్షణాత్మక ధోరణితో ఆడింది. ఢిల్లీ వరుసగా అటాకింగ్ చేసినా నార్త్ డిఫెండర్లు సమర్థంగా తిప్పికొట్టారు. నిమిషం తేడాలో వచ్చిన రెండు అవకాశాలను లీ బెర్టోస్ (నార్త్) వృథా చేశాడు. మ్యాచ్ చివర్లో ఢిల్లీ మిడ్ఫీల్డర్ హన్స్ ముల్దార్ చూడ చక్కని స్ట్రయికింగ్తో అలరించినా స్కోరు చేయలేకపోయాడు.