చివరి క్షణాల్లో గెలిచిన దబంగ్‌ ఢిల్లీ

చివరి క్షణాల్లో గెలిచిన దబంగ్‌ ఢిల్లీ


అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహ యజమానిగా ఉన్న తమిళ్‌ తలైవాస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 30–29తో ఒక్క పాయింట్‌ తేడాతో గెలిచింది. మ్యాచ్‌ ముగియడానికి మరో 40 సెకన్ల వ్యవధి ఉందనగా ఢిల్లీ 27–28తో వెనుకబడి ఉంది. ఈ దశలో రైడింగ్‌కు వెళ్లిన ఢిల్లీ ప్లేయర్‌ మేరాజ్‌ షేక్‌ మూడు పాయింట్లు సాధించడంతో ఢిల్లీ 30–28తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత తమిళ్‌ తలైవాస్‌ రైడర్‌ అజయ్‌ ఠాకూర్‌ ఒకపాయింట్‌ సాధించినా ఫలితం లేకపోయింది. చివరకు ఢిల్లీ జట్టు ఒక్క పాయింట్‌తో గట్టెక్కింది.



తలైవాస్‌ తరఫున అజయ్‌ ఠాకూర్‌ 14 పాయింట్లు స్కోరు చేసినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఢిల్లీ తరఫున మేరాజ్‌ షేక్‌ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు సాధించాడు. మరోవైపు గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్, బెంగాల్‌ వారియర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 26–26తో టైగా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో యు ముంబా; బెంగళూరు బుల్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌–2 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top