మళ్లీ ధోనిని కెప్టెన్ చేయండి..

మళ్లీ ధోనిని కెప్టెన్ చేయండి..


న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచ్ ల్లో  భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే జట్టు ప్రతిష్టను పెంచాడు. అయితే అనిల్ కుంబ్లేతో వివాదం పెట్టుకుని అతను కోచ్ పదవి నుంచి వైదొలగడానికి కారణమైన కోహ్లిపై ఇప్పుడు  విమర్శల వర్షం కురుస్తోంది.



ప్రధానంగా కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ ఒక సెక్షన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం భారత్ క్రికెట్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి ముగింపు పలకాలంటే తిరిగి ధోనిని జాతీయ జట్టుకు కెప్టెన్ గా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆన్ ఫీల్డ్లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్లో సైతం హుందాగా ఉండే ధోనినే సారథిగా కరెక్ట్ అంటూ పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.



ఇదిలా ఉంచితే, కోహ్లి తీరును భారత షూటర్ అభినవ్ బింద్రా కూడా పరోక్షంగా తప్పుబట్టాడు. కోచ్ తో విభేదాలు అంత మంచివి కావనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో తనకు 20 ఏళ్లుగా కోచ్ గా ఉన్న ఉవితో వివాదాన్ని ఇక్కడ బింద్రా ప్రస్తావించాడు. ' నేను ఉవితో 20 ఏళ్లపాటు కలిసి పనిచేశాను. నాకు ఏది నచ్చదో అదే అతనే చెప్పేవాడు. దాంతో అతన్ని అసహ్యించుకునే వాడిని. కాకపోతే నా అత్యుత్తమ గురువు అతనే అని కచ్చితంగా చెప్పగలను' అని బింద్రా పేర్కొన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top