కాంస్యంతో ముగించారు
జపాన్పై భారత మహిళల హాకీ జట్టు గెలుపు
ఇంచియాన్: తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జపాన్ జట్టుపై సంచలన విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2-1 గోల్స్ తేడాతో జపాన్ను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున జస్ప్రీత్ కౌర్ (23వ నిమిషంలో), వందన కటారియా (42వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... జపాన్ జట్టుకు అకెన్ షిబాటా (41వ నిమిషంలో) ఏకైక గోల్ను అందించింది. తాజా విజయంతో భారత్ 2010 గ్వాంగ్జౌ క్రీడల కాంస్య పతక పోరులో జపాన్ చేతిలోనే ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఓవరాల్గా ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టుకిది మూడో కాంస్యం కావడం విశేషం. గతంలో 1986 సియోల్, 2006 దోహా ఆసియా క్రీడల్లో టీమిండియాకు మూడో స్థానం దక్కగా... 1982 ఢిల్లీ క్రీడల్లో మాత్రం స్వర్ణం లభించింది.