స్వర్ణ కాంతలు

స్వర్ణ కాంతలు


 షూటింగ్‌లో రెండు స్వర్ణాలు సాధించిన భారత మహిళలు

 భారత మహిళల సత్తా ఇది. వారి ఏకాగ్రత, నైపుణ్యానికి నిదర్శనం ఇది. కామన్వెల్త్ షూటింగ్‌లో శనివారం మహిళల విభాగంలో రెండు ఈవెంట్లు జరిగితే... రెండింటిలోనూ స్వర్ణాలు, రజతాలు కూడా మనోళ్లే సాధించారు.  రైఫిల్ అయినా, పిస్టల్ అయినా తమకు ఎదురులేదని నిరూపిస్తూ... భారత శిబిరంలో స్వర్ణ కాంతులు నింపారు.

 

 గ్లాస్గో:  కామన్వెల్త్ క్రీడల షూటింగ్‌లో శనివారం భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు చేరాయి. ఇందులో నాలుగు పతకాలు మహిళా క్రీడాకారిణులే సాధించడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో, 25 మీటర్ల పిస్టల్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు లభించాయి. ఇవే ఈవెంట్లలో రెండు రజతాలు కూడా మన సొంతమయ్యాయి. అపూర్వి చండేలా, రాహీ సర్నోబత్ బంగారు పతకాలతో చమక్కుమనిపించగా...అయోనికా పాల్, అనీసా సయ్యద్ వెండి వెలుగులు కురిపించారు. అటు పురుషుల విభాగంలో 10మీ. ఎయిర్ పిస్టల్‌లో ప్రకాశ్ నంజప్ప కూడా రజతం సాధించాడు.

 

 బింద్రా స్ఫూర్తితో: బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణం గెలవడంతో స్ఫూర్తి పొంది... షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న రాజస్థాన్ అమ్మాయి అపూర్వి చండేలా కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి కాంతులు పూయించింది.  శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 206.7 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణం పతకం సాధించింది. మరో షూటర్ అయోనికా పాల్ 204.9 పాయింట్లతో రెండో స్థానంతో రజతం గెలుచుకుంది. మహ్మద్ తైబీ (మలేసియా-184.4 పాయింట్లు) కాంస్యాన్ని దక్కించుకుంది.

 

 అనీసా వెనక్కి...: 25మీటర్ల పిస్టల్ విభాగంలో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం ప్రదర్శించారు. చేతికి ఫ్రాక్చర్ కావడంతో మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న రాహీ సర్నోబత్... ఇప్పుడు నేరుగా బరిలోకి దిగి స్వర్ణం గెలుచుకోవడం విశేషం. ఈ క్రమంలో ఢిల్లీ క్రీడల్లో స్వర్ణం సాధించిన అనీసాను రాహీ వెనక్కి నెట్టింది. సెమీఫైనల్లో రాహీ 16 పాయింట్లు, అనీసా 14 పాయింట్లు సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఫైనల్లో రాహీ 8-2 తేడాతో సహచర భారత క్రీడాకారిణిని చిత్తు చేసింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన యౌహ్లయుస్కయ కాంస్యం గెలుచుకుంది.

 

 మెరిసిన ప్రకాశ్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ప్రకాశ్ నంజప్ప 198.2 పాయింట్లతో రజత పతకాన్ని సాధించాడు. రెండో సిరీస్ ఎలిమినేషన్ వరకు పూర్తి ఆధిక్యంలో ఉన్న భారత షూటర్.. ఆరో షాట్ గురి తప్పాడు. ఈ షాట్‌కు 7.7 పాయింట్లు మాత్రమే రావడంతో రెండో స్థానంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. డానియెల్ రెప్‌చోలి (ఆస్ట్రేలియా-199.5 పాయింట్లు) స్వర్ణం, మైకేల్ గల్ట్ (ఇంగ్లండ్-176.5 పాయింట్లు) కాంస్య పతకాలను సాధించారు. పురుషుల స్కీట్ ఈవెంట్‌లో మైరాజ్ అహ్మద్ ఖాన్ 7వ, బాబా బేడీ 19వ స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరడంలో విఫలమయ్యారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top