బెంగళూర్ కు చెన్నై షాక్

బెంగళూర్ కు చెన్నై షాక్


చెన్నై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ వరుస వికెట్లను చేజార్చుకుని ఓటమి చెందింది.  బెంగళూర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(48), ఏబీ డివిలియర్స్(21), దినేశ్ కార్తీక్(23) పరుగుల మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఏడుగురు బెంగళూర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో బెంగళూర్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. చెన్నై బౌలర్లలో ఆశిష్ నెహ్రా మూడు వికెట్లు తీసి మరోసారి సత్తాచాటగా, ఐశ్వర్ పాండే, బ్రేవో లకు చెరో రెండు వికెట్లు, మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.



అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నచెన్నై ఆదిలో తడబడింది.  స్కోరు బోర్డుపై పరుగులేవీ లేకుండానే డ్వేన్ స్మిత్ వికెట్ ను కోల్పోయింది. అనంతరం బ్రెండన్ మెకల్లమ్(20) పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. కాగా సురేష్ రైనా,  డుప్లెసిస్ జోడి కాసేపు బెంగళూర్ బౌలర్లను ప్రతిఘటించడంతో చెన్నై స్కోరు బోర్డు ముందుకు కదిలింది. డు ప్లెసిస్(24), సురేష్ రైనా(52) పరుగులు చేసిన అనంతరం అవుటయ్యారు.

 

ఆ తరువాత రవీంద్ర జడేజా(3), మహేంద్ర సింగ్ ధోనీ(29) నిష్ర్కమించడంతో చెన్నై రక్షణాత్మక ధోరణి కొనసాగించింది. చెన్నై మిగతా ఆటగాళ్లలో నేగీ(13), బ్రేవో(2) పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top