‘స్టే’కు హైకోర్టు నిరాకరణ
చెన్నై సూపర్ కింగ్స్ కేసు
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రద్దు చేస్తూ లోధా కమిటీ చేసిన సిఫారసులపై ‘స్టే’ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని టీమ్ యాజమాన్యం సీఎస్కే క్రికెట్ లిమిటెడ్ చేసిన విజ్ఞప్తిని మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అయితే చెన్నై జట్టు పిటిషన్కు వివరణ ఇస్తూ రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివగ్ననమ్లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే లోధా కమిటీ సిఫారసులపై బీసీసీఐ తీసుకునే ఏ నిర్ణయమైనా కోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది. మరోవైపు కోల్కతాలో గురువారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. చెన్నై, రాజస్థాన్ స్థానంలో వచ్చే రెండు సీజన్లలో రెండు కొత్త జట్లను ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనికి బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
సంబంధిత వార్తలు