భారత ‘గ్రీన్’ జట్టులో చందన్ సహాని
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అండర్–19 చాలెంజర్ టోర్నీకి హైదరాబాద్ ఆటగాడు చందన్ సహాని ఎంపికయ్యాడు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో అతను ఇండియా గ్రీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇండియా రెడ్, ఇండియా బ్లూ బరిలో ఉన్న ఇతర జట్లు. నేటినుంచి ఈ నెల 29 వరకు చాలెంజర్ టోర్నీ హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్లో జరుగుతుంది.
ఇటీవల జాతీయ అండర్–19 టోర్నీ వినూమన్కడ్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా ఈ మూడు టీమ్లను ఎంపిక చేశారు. సౌత్ జోన్ స్థాయిలో 4 మ్యాచ్లలో కలిపి 190 పరుగులు చేసిన చందన్... అనంతరం జోనల్ స్థాయిలో 3 మ్యాచ్లలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సహా 191 పరుగులు చేశాడు. గ్రీన్ జట్టులోనే ఆంధ్ర ఆటగాడు పి.గిరినాథ్ రెడ్డి కూడా ఎంపికయ్యాడు.