రెండో టెస్టు:నాల్గో రోజు బౌలర్ల హవా
బ్రిస్బేన్: టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో నాల్గో రోజు ఆటలో బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి రోజు భారత బ్యాట్స్ మెన్ లు పూర్తి స్థాయి ఆధిపత్యం కొనసాగించగా, రెండో రోజు బౌలర్లు పైచేయి సాధించారు. రెండో రోజు ఆటలో ఏకంగా 10 వికెట్లు నేల రాలడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే మూడో రోజు మాత్రం బ్యాటింగ్ హవానే కొనసాగింది. ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోగా, భారత్ ఒక వికెట్టును చేజార్చుకుంది. ఇదిలా ఉండగా నాల్గో రోజు పూర్తిగా బౌలర్లే హవానే కొనసాగుతోంది. టీ సమయానికే టీమిండియా తొమ్మిది వికెట్లను కోల్పోగా , అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ రెండు వికెట్లను చేజార్చుకుంది.
అంతకుముందు వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికే ఏడు వికెట్లను నష్టపోయిన టీమిండియా ఒక్కసారిగా చతికిలబడింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ కు ఉమేశ్ యాదవ్ జతకలిసి కాసేపు మరమ్మత్తులు చేపట్టాడు.
ఇరువురూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులు చేసింది. ప్రస్తుతం 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది.