అక్షర్... అదుర్స్
ఒక్క పరుగు ఇవ్వకుండా 4 వికెట్లు
దక్షిణాఫ్రికా ‘ఎ’పై భారత్ ‘ఎ’ గెలుపు
1-0తో సిరీస్ కైవసం
వాయ్నాడ్ (కేరళ): స్పిన్నర్ అక్షర్ పటేల్ (6-6-0-4) స్పిన్ మాయాజాలానికి దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన అనధికార రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. 157 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో శుక్రవారం నాలుగో రోజు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 31.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. డికాక్ (20) టాప్ స్కోరర్. నాలుగో ఓవర్లో ఓపెనర్ హెండ్రిక్స్ (1)ను అవుట్ చేసి అక్షర్ భారత్కు తొలి వికెట్ అందించాడు.
తర్వాత వాన్జెల్ (10)తో సహా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో సఫారీ జట్టు 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డికాక్ పోరాడే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్ నుంచి భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. దీంతో ప్రొటీస్ బ్యాట్స్మెన్ వరుస విరామాల్లో పెవిలియన్కు క్యూ కట్టారు. ఓవరాల్గా 8 మంది సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. అక్షర్కు తోడు జయంత్ యాదవ్ కీలక సమయంలో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నా డు. శార్దూల్, కర్ణ్ శర్మ, అపరాజిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నిం గ్స్ను 417/8 ఓవర్నైట్ స్కోరు వద్దే డిక్లేర్ చేసింది.