విరాట్ సేన ఘోర పరాజయం
పుణె: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలై సిరీస్ ను పేలవంగా ప్రారంభించింది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం 441 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్(2) తో మొదలైన పతనకం కడవరకూ కొనసాగింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 107 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా మూడు రోజులు జరగకుండానే ముగిసింది. భారత ఆటగాళ్లలో చటేశ్వర పూజారా(31) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
ఆ తరువాత భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(10), విరాట్ కోహ్లి(13), అజ్యింకా రహానే(18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. ఏడుగురు భారత ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ మరోసారి విజృంభించి భారత్ వెన్నువిరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో ఓకీఫ్ ఆరు వికెట్లు సాధించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత లయన్ నాలుగు వికెట్లు తీశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో పది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం ఇక్కడ విశేషం.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌటైన ఆసీస్ కు ఓవరాల్ గా 440 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆటలో భాగంగా 143/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 142 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. ఆసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్(109;202 బంతుల్లో11 ఫోర్లు) శతకం సాధించాడు. ఈ రోజు ఆటలో మిచెల్ మార్ష్(31),వేడ్(20), మిచెల్ స్టార్క్(30)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, జడేజా మూడు, ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. జయంత్ యాదవ్లకు వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో 155 పరుగుల ఆధిక్యాన్ని ఆసీస్ సాధించిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 260 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 285 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 105 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 107 ఆలౌట్