విరాట్ సేనకు భారీ లక్ష్యం
పుణె:నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా 441 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌటైన ఆసీస్ కు ఓవరాల్ గా 440 పరుగుల ఆధిక్యం లభించింది.
మూడో రోజు ఆటలో భాగంగా 143/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 142 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. ఆసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్(109;202 బంతుల్లో11 ఫోర్లు) శతకం సాధించాడు. ఈ రోజు ఆటలో మిచెల్ మార్ష్(31),వేడ్(20), మిచెల్ స్టార్క్(30)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, జడేజా మూడు, ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. జయంత్ యాదవ్లకు వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో 155 పరుగుల ఆధిక్యాన్ని ఆసీస్ సాధించిన సంగతి తెలిసిందే.
లంచ్ లోపే..
రెండో రోజు ఆటలో ఆసీస్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోవడంతో ఈ రోజు మరో రెండు సెషన్లు పాటు ఆడే అవకాశం ఉందని భావించారు. అయితే భారత్ బౌలర్లు సమష్టిగా రాణించి ఆసీస్ ఇన్నింగ్స్ ను లంచ్ లోపే ముగించారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేదు. భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 169 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ ను జడేజా పెవిలియన్ కు పంపి మంచి ఆరంభాన్నిచ్చాడు. ఆ తరువాత వేడ్ తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 35 పరుగుల జోడించిన తరువాత వేడ్ పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత కాసేపటికి స్మిత్, స్టార్క్లు స్వల్ప వ్యవధిలో అవుట్ కాగా, లయన్, ఓకెఫ్ లు కూడా ఎంతో సేపు క్రీజ్ లో నిలవలేదు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 260 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 285 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 105 ఆలౌట్