18 పరుగుల వద్ద తొలి వికెట్టును కోల్పోయిన ఆసీస్
బ్రిస్బేన్:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులకే తొలి వికెట్టును కోల్పోయింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా వార్నర్(6) ను తొలి వికెట్టు రూపంలో కోల్పోయింది. ప్రస్తుతం రోజర్స్ (11)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్ ఇషాంత్ కు తొలి వికెట్టు దక్కింది.అంతకుముందు టీమిండియా తన రెండో్ ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా 128 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఆసీస్ కు నిర్దేశించింది. ఓపెనర్ శిఖర్ థవన్ (81) చటేశ్వర పూజారా(43)పరుగులు మినహా ,మిగతా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఘోరంగా వైఫల్యం చెందడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 224 పరుగులకే పరిమితమైంది.
76 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ వికెట్టును కోల్పోయిన టీమిండియా.. ఆ తరువాత క్రీజ్ లో నిలబడటానికే బెంబేలెత్తింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. శిఖర్, ఉమేశ్ యాదవ్ లు ఇరువురూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో వైఫల్యం చెందిన శిఖర్ ఈ మ్యాచ్ లో మాత్రం హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా.. టీమిండియా స్కోరును రెండు వందలు దాటించి పరువు దక్కించాడు. ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు.