ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఆసీస్
హొబర్ట్: ముక్కోణపు సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. ఇంగ్లండ్ తో శుక్రవారమిక్కడ ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లీషు సేన నిర్దేశించిన 304 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఇయాన్ బెల్ 125 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 141 పరుగులు చేసినా.. జట్టుకు మాత్రం పెద్దగా ప్రయోజనం కలగలేదు. జో రూట్ 69 పరుగులు చేసి బెల్ కు కొంత సాయంగా నిలిచాడు.
ఇక లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్ ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 93 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతకిడిది మూడో సెంచరీ. 102 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. చివర్లో వరుసగా వికెట్లు పడడంతో ఉత్కంఠ రేగింది. అయితే విజయం కంగారూలనే వరించింది. ఫించ్ 32, మార్ష్ 45, మ్యాక్స్ వెల్ 37, ఫాల్కనర్ 35, హాడిన్ 42 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, అలీ, ఫిన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.