ఆసక్తికరంగా రెండో టెస్ట్
బ్రిస్బేన్:టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసే సరికి దాదాపు ఇరు జట్లు సమాన స్థాయిలోనే ఆటను కొనసాగించడమే ఇందుకు ఉదాహరణ. తొలి రోజు భారత బ్యాట్స్ మెన్ లు పూర్తి ఆధిపత్యం వహించగా, రెండో రోజు పూర్తిగా బౌలర్లు పై చేయి సాధించారు. గురువారం రెండో రోజు ఆటలో ఆరు భారత వికెట్లు నేల రాలగా, ఆసీస్ నాలుగు వికెట్లను కోల్పోయింది. కాగా మూడో రోజు ఆటలో ఇందుకు భిన్నంగా కొనసాగింది.
మూడో రోజు ఆటలో భాగంగా ఆసీస్ 284 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్ గా తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులు చేసిన ఆసీస్ 97 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అటు తరువాత రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్ వికెట్టు కోల్పోయి 71 పరుగులు చేసింది. భారత ఓపెనర్ మురళీ విజయ్ వికెట్టును 27 పరుగుల వద్ద కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా శిఖర్ థావన్ (26), పూజారా(15) పరుగులతో క్రీజ్ ఉన్నారు. మరో తొమ్మిది వికెట్లు భారత్ చేతిలో ఉండటంతో రేపటి మ్యాచ్ లో ధోనీ సేన దూకుడుగా ఆడే అవకాశం ఉంది. నాల్గో రోజు ఆటలో భారత్ భారీ ఇన్నింగ్స్ చేసి.. ఆసీస్ కు భారీ లక్ష్యాన్ని విసిరితే మాత్రం ఫలితం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.