ఒక పరుగు తేడాతో ఓటమి
మాకే(ఆస్ట్రేలియా): ఇటీవల అమెరికాలో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ 20లో భారత క్రికెట్ జట్టు ఒక పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత యువ జట్టు కూడా పరుగు తేడాతో పరాజయం చెందింది. క్వాడ్రాంగులర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా -ఎ జట్టుతో జరిగిన వన్డేలో భారత కుర్రాళ్లు పోరాడి ఓడారు. ఆస్ట్రేలియా జట్టు విసిరిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత-ఎ జట్టు గెలుపు అంచుల వరకూ వెళ్లి పరాజయం చవిచూసింది.
భారత ఆటగాళ్లలో మనీష్ పాండే(110;91 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో మెరవగా, సంజూ శాంసన్(87; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), మనదీప్ సింగ్(56;60 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. కాగా, నాలుగు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 321 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఎ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో పాటర్సన్(112), మ్యాడిన్సన్(118) విశేషంగా రాణించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఈ క్వాడ్రాంగులర్ సిరీస్లో ఇప్పటికే భారత యువ జట్టు ఫైనల్ కు చేరగా, ఈ మ్యాచ్లో విజయంతో ఆస్ట్రేలియా తుది పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 4 వ తేదీన ఫైనల్ జరుగనుంది.