ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఉతికేశాడు
విక్టోరియా: ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక విజయం సాధించింది. ఆల్ రౌండర్ గుణరత్నే సునామీ ఇన్నింగ్స్ తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు అవసరం కాగా 5 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. దీంతో 2 బంతులు మిగిలివుండగానే లంక గెలిచింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. హెన్రీక్స్ 52, క్లింగర్ 43, డంక్ 32, ఫించ్ 12 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో కులశేఖర 4 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్ లోనే 3 వికెట్లు తీశాడు. మలింగ, బండారా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
174 పరుగుల లక్ష్యంతో దిగిన లంక 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. చమర కపుగెడెర(32) సహాయంతో గుణరత్నే అసమాన పోరాటం చేసి జట్టును గెలిచిపించాడు. గుణరత్నే 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్ లో 14 పరుగులు అవసరం కాగా మొదటి ఐదు బంతులకు 12 పరుగులు వచ్చాయి. చిట్టచివరి బంతికి 2 పరుగులు చేయాల్సివచ్చింది. దీంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. గుణరత్నే ఫోర్ కొట్టి శ్రీలంకకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అతడికే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. మొదటి టీ20లోనూ చివరి బంతికి శ్రీలంక విజయం సాధించింది.
మొదటి మ్యాచ్ వార్త ఇక్కడ చదవండి:
ఆఖరి బంతికి శ్రీలంక గెలుపు
సంబంధిత వార్తలు