కుంబ్లే నియామకంపై రహానే హర్షం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎంపిక కావడం పట్ల టాపార్డర్ ఆటగాడు అజింక్యా రహానే హర్షం వ్యక్తం చేశాడు. విశేష అనుభవం ఉన్న అతని కోచింగ్లో భారత క్రికెట్ జట్టు మరింత ఉన్నతస్థానంలో నిలుస్తుందని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా తొలిసారి కుంబ్లేతో కలిసి అనుభవం పంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. 'కుంబ్లేకు అపార అనుభవం ఉంది. చాలా ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడు కుంబ్లే. తద్వారా అతని సూచనలు జట్టు విజయాలకు కచ్చితంగా దోహదం చేస్తుంది. కుంబ్లేతో ఇదే నా తొలి అనుభవం. నేను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడేటప్పటికే కుంబ్లే అక్కడ లేడు. దీంతో అతనితో డ్రెస్సింగ్ రూమ్ అనుభవాన్ని పంచుకోలేకపోయా.అతను కోచ్ ని నియమించడం నిజంగా భారత క్రికెట్ కు మంచి పరిణామం'అని రహానే తెలిపాడు.
గత రెండు రోజుల క్రితం కుంబ్లేను భారత క్రికెట్ ప్రధాన కోచ్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు విదేశీయులు టామ్ మూడీ, స్టువర్ట్లా, ఆండీ మోల్స్ తదితరులు పోటీ పడినా కుంబ్లే వైపే బోర్డు అడ్వైజరీ కమిటీ మొగ్గు చూపింది. దీంతో ఏడాది పాటు కుంబ్లేను చీఫ్ కోచ్గా నియమించింది.