ముంబై చీఫ్ మెంటర్ పదవికి కుంబ్లే గుడ్ బై
ముంబై: గత కొంతకాలంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు చీఫ్ మెంటర్ గా వ్యవహరిస్తున్న భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆ పదవికి రాజీనామా చేశాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చీఫ్ మెంటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కుంబ్లే సోమవారం ప్రకటించాడు.
ఐపీఎల్ ఆరో సీజన్ లో భాగంగా 2013లో ముంబై జట్టు చీఫ్ మెంటర్ గా కుంబ్లే బాధ్యతలు చేపట్టాడు. కుంబ్లే బాధ్యతలు చేపట్టిన ఏడాదే ముంబై ఇండియన్స్ తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత 2015లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన ముంబై జట్టు మరోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ ఆరంభం సంవత్సరం నుంచి అంటే 2008 నుంచి 2013 జనవరి వరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో కుంబ్లే సభ్యుడిగా కొనసాగాడు.
కాగా, రాయల్ చాలెంజర్స్ కు గుడ్ బై చెప్పిన అనంతరం కుంబ్లే ముంబై ఇండియన్స్ జట్టుకు చీఫ్ మెంటర్ గా వ్యవరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే మూడేళ్ల పాటు ముంబై జట్టుకు దిగ్విజయంగా సేవలు అందించిన కుంబ్లే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. దీనిపై ముంబై జట్టు యాజమాన్యం కుంబ్లే సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపింది. భారత జట్టు తరపున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే సేవలను ఇక తమ జట్టు కోల్పోతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
సంబంధిత వార్తలు