అండర్సన్ అదుర్స్

అండర్సన్ అదుర్స్


రెండో టెస్టులో విండీస్‌పై ఇంగ్లండ్ గెలుపు

గ్రెనడా: పేసర్ జేమ్స్ అండర్సన్ (4/43) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం కుక్ సేన మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు మే 1 నుంచి బార్బడోస్‌లో జరుగుతుంది. 202/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు శనివారం ఆట ప్రారంభించిన విండీస్ చివరి ఎనిమిది వికెట్లను 105 పరుగుల తేడాలో కోల్పోయింది.



తమ రెండో ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ‘సెంచరీ హీరో’ బ్రాత్‌వైట్ (252 బంతుల్లో 116; 14 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 15 పరుగులు జతచేశాక అండర్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అక్కడ్నుంచి విండీస్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 41.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 144 పరుగులు చేసి నెగ్గింది. కుక్ (59 నాటౌట్; 8 ఫోర్లు), బ్యాలన్స్ (81 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీయడంతోపాటు రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్ చేసిన అండర్సన్ ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top