ఆనంద్‌కు మళ్లీ డ్రా


సెయింట్ లూయిస్ : సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. ఆదివారం నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనిష్ గిరితో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ రౌండ్ అనంతరం విషీ రెండు పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. నల్లపావులతో ఆడిన ఆనంద్‌కు ఈ టోర్నీలో పెద్దగా కలిసి రావడం లేదు. తొలి రెండు గేమ్‌ల్లో ఓడిన అతను తర్వాత డ్రాలతో సరిపెట్టుకుంటున్నాడు.



మరోవైపు తెల్లపావులతో గిరి.. స్లావ్ డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో లాగ్రావి (ఫ్రాన్స్-3.5)... తపలోవ్ (బల్గేరియా-3)పై; నకమురా (అమెరికా-3.5)... వెస్లీ సో (అమెరికా-1.5)పై; గ్రిస్చుక్ (రష్యా-3)... కరుణ (అమెరికా-2)పై నెగ్గగా; ఆరోనియన్ (ఆర్మేనియా-4)... కార్ల్‌సన్ (నార్వే-4)ల మధ్య గేమ్ డ్రాగా ముగిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top