నాపై ధోనికి నమ్మకం ఉండటంతోనే..
ముంబై: జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడు కెప్టెన్ నమ్మకాన్ని కల్గి ఉండాలని ఆశిష్ నెహ్రా తెలిపాడు. ఐపీఎల్ -8 భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కింగ్స్ విజయం సాధించిన నేపథ్యంలో నెహ్రా స్పందించాడు. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనపై నమ్మకం ఉంచడంతోనే మూడు వికెట్లు తీశానని నెహ్రా ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
'నేను ఇప్పటివరూ ట్వంటీ 20 ల్లో గానీ, వన్డేల్లో గానీ మూడు స్పెల్ ల్లో బౌలింగ్ చేశాను. అది ఆరంభ ఓవర్లు కావచ్చు.. చివరి ఓవర్లు కావచ్చు. నిన్న కూడా అదే జరిగింది. మా కెప్టెన్ ధోనీ 15 ఓవర్ ను నాకు అప్పచెప్పాడు. అంతతొందరగా నాకు బౌలింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అనే ఆలోచనలో పడ్డా. గేమ్ ముందుకు వెళుతుంది. మనం వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. చివరి నాలుగైదు ఓవర్లలో 80-90 పరుగులు వచ్చే అవకాశం ఉంది. పరుగులను నియంత్రించాలి' అని ధోనీ తనతో చెప్పినట్లు నెహ్రా తెలిపాడు. మొత్తంగా నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ వేసిన నెహ్రా మూడు వికెట్లు తీసి ముంబై పరుగుల ప్రవహాన్ని కట్టడి చేసిన సంగతి తెలిసిందే.