చెన్నై సూపర్ కింగ్స్ కు రస్సెల్ షాక్!
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అద్బుత విజయాన్ని చేజిక్కించుకుంది. 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన కోల్ కతా ఓ దశలో 9 ఓవర్లలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే టెన్ డస్కోటే, అండ్రూ రస్సెల్ లు కలిసి స్కోరును పరుగులు పెట్టించారు.
అండ్రూ రస్సెల్ వీరవిహారం చేసి 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 58 పరుగులు చేయగా, డస్కోటే 41 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 51 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్రను పోషించారు.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ధోని సేన బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావోలు రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. స్మిత్ 20, మెక్కాలమ్ 22, రైనా 28 పరుగులు చేసి చేశారు. చివర్లో 20 బంతుల్లో ధోని 2 సిక్సర్లు, 3 ఫోర్లు, బ్రావో 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు సాధించడంతో 158 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా ముందు చెన్నై ఉంచింది.