అభిలాష ట్రిపుల్ ధమాకా


సాక్షి, హైదరాబాద్:


హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఎ.అభిలాష మూడు టైటిళ్లను చేజిక్కించుకుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో ఆమె అండర్-15లో సింగిల్స్, డబుల్స్ టైటిళ్లతో పాటు అండర్-17 సింగిల్స్‌లోనూ విజేతగా నిలిచింది. ఫైనల్లో అభిలాష 15-12, 15-10తో చక్రయుక్తపై గెలిచింది. అండర్-15 సింగిల్స్ తుదిపోరులో ఆమె 16-14, 15-8తో ప్రణవిపై నెగ్గింది. డబుల్స్‌లో ప్రణవితో కలిసి 15-7, 15-8తో శ్రావ్య-పల్లవి జోషి జంటపై గెలిచింది.



అండర్-13 బాలుర డబుల్స్‌లో శశాంక్ సాయి-నిక్షిప్త్ శౌర్య 15-11, 15-8తో శ్రీమాన్ ప్రీతమ్-సిద్ధార్థ్‌లపై నెగ్గారు. సింగిల్స్‌లో ఉన్నిత్ కృష్ణ 15-7, 15-10తో నిక్షిప్త్ శౌర్యపై గెలిచాడు. బాలుర అండర్-17 సింగిల్స్, డబుల్స్‌లో విష్ణువర్ధన్ గౌడ్ సత్తాచాటుకున్నాడు. రెండు విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు. సింగిల్స్‌లో విష్ణువర్ధన్ 16-14, 15-11తో అంకిత్ రెడ్డిని కంగుతినిపించాడు. డబుల్స్‌లో విష్ణువర్ధన్-మొయినుద్దీన్ 15-11, 13-15, 15-9తో సాయి రోహిత్-ఆకాశ్ చంద్రన్‌లపై గెలుపొందారు.



బాలుర అండర్-19 సింగిల్స్ ఫైనల్లో సాయం బొత్రా 15-10, 15-8తో ఆదిత్య గుప్తాపై, అండర్-15 సింగిల్స్‌లో యశ్వంత్ రామ్ 14-16, 16-14, 15-4తో శశాంక్ సాయిపై విజయం సాధించారు. పురుషుల తుదిపోరులో డబుల్స్ తుదిపోరులో వినాయక్-తన్షఖ్ 11-15, 16-14, 15-11తో విజేత-కిషోర్‌లపై గెలిచారు. సింగిల్స్‌లో వెంకట్ 15-10, 15-9తో శ్రీరామ్‌పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను పూజ గెలుచుకుంది. ఆమె 15-12, 15-10తో ప్రణాలి కర్ణిపై నెగ్గింది.


 


డబుల్స్‌లో ప్రణవి-ప్రణాలి కర్ణి 15-10, 15-1తో మౌన్యశ్రీ-క్రాంతిలపై గెలుపొందారు. ఈ టోర్నీలో విజేత, రన్నరప్‌గా నిలిచిన బాలబాలికలను హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టు నేటి (గురువారం) నుంచి వరంగల్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తలపడుతుంది.




 హైదరాబాద్ జట్టు: విష్ణువర్ధన్ గౌడ్, అంకిత్, మొహమ్మద్ ఖాదిర్, అభిలాష, చక్రయుక్త రెడ్డి, సాయం బోత్రా, ఆదిత్య గుప్తా, సాయి రోహిత్, ఆకాశ్, ప్రణవి రెడ్డి, ప్రణాలి క ర్ణి, కృష్ణా రెడ్డి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top