రచయితకు మరణం సరే.. మరి అక్షరానికీ..?

పెరుమాళ్ మురుగన్ , తమిళ రచయిత - Sakshi


‘‘రచయితగా పెరుమాళ్ మురుగన్ మరణించా డు. అతడేమీ దేవుడు కాదు. కావున అతని పునరు త్థానం ఏమీ ఉండదు. ఇక నుంచి పెరుమాళ్ మురుగన్ ఒక ఉపాధ్యాయుడుగా మాత్రమే బతికి ఉంటాడు’’. ప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌పై, ఆయన నవల మాదురో బాగన్‌పై (వన్ పార్ట్ విమన్) ఇటీవలే దాడి జరిగి, నమ్మక్కల్ జిల్లా అధికార యంత్రాంగం ఆయనకు రక్షణ ఇవ్వ డంలో విఫలమవడంతో ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన ప్రకటన అది. అణగారిన కులాల పట్ల ఆత్మీయత చూపిన రచయితపై ఎందుకు దాడి జరిగింది?

 

మాదురో బాగన్ తమిళ నవల 2010లోనే ప్రచురితమై, ఆదరణ పొంది పునర్ముద్రణలు పొం దింది. ఆ నవలను అనిరుథ్ వాసుదేవన్ ఆంగ్లం లోకి అనువదించాడు. పెంగ్విన్ ప్రచురణగా 2013 లో వెలువడింది. మరి ఇప్పుడెందుకు దాడిని యెంచుకున్నారు? ప్రైవేటు విద్యారంగ మాఫియా శక్తులు, వాటికి అండగా నిలిచిన హిందూత్వ, అగ్రకుల పెత్తందారీ శక్తులు ఈ దాడికి బాధ్యులు.

 

నవలలో దానిని వ్యతిరేకించే వారికి అభ్యంతర కరమైనవిగా తోచిన భాగాలను తరువాతి ముద్రణ లో తొలగిస్తానని, వారితో చర్చకు తాను సిద్ధమేనని పెరుమాళ్ మురుగన్ ప్రతిపాదించినా ఖాతరు చేయకుండా దాడి కొనసాగిం చారు. నవల కాపీలను తగలబెట్టి, రచయితను భయపెట్టి రచనారంగం నుండి తప్పు కోవాలనే నిర్ణయానికి నెట్టి న అభ్యంతరకర అంశాలు మాదురో బాగన్ నవలలో ఏమున్నాయి?

 

ఈ నవల తిరుచెంగోడు ప్రాంతం లో గౌండర్ కులానికి  చెందిన వ్యవసా య కుటుంబంలోని కాళి, అతని భార్య పొన్నల  కథ. పెళ్లయి పన్నెండేళ్లయినా  సంతానం కలగలేదు. దీని వల్ల సమాజం వాళ్లను కించపరుస్తూ ఉంటుం ది. పెళ్లయినా సంతానం కలగకపోవడంతో అవహే ళనకు గురయ్యే పరిస్థితి మన సమాజంలో నేటికీ ఉంది. ఈ నవల కథా సందర్భం వందేళ్ల నాటిది అని గుర్తుంచుకుంటే దాని తీవ్రత అర్థమవుతుంది. కాళి, పొన్నల సంతానలేమికి కారణం వంశాగల్ శాపమనీ, తిరుచెంగోడు కొండల మీద వెలసిన పవల్ అనే దుష్టదేవత విగ్రహం కూడా ఒక కారణ మనీ వారి ఇరువురి తల్లులూ భావిస్తుంటారు. శాంతిపూజ చేయిస్తారు. వంశాకురం లేకపోవడం తీవ్ర అవమానంగా భావి స్తారు.



చివరకు ఆ ప్రాంతంలో వాడుక లో ఉన్న ఒక సంప్రదాయంలో పరిష్కా రం వెతుకుతారు. ఆ ప్రాంతంలో ఉన్న అర్ధనారీశ్వర దేవాలయం  వద్ద జరిగే రథోత్సవాలలో పదునాల్గవ రోజు సం తానంలేని వివాహిత స్త్రీలు (దైవరూప) పరపురుషునితో సంగమించే  ఆచారం వందేళ్ల క్రితం  ఉండేది. తద్వారా సంతానం కలిగితే ఆ సంతానానికి సామి పిళ్లై (దేవుని బిడ్డ) అని నామకరణం చేస్తారు. ఆ ఆచారాన్ని అనుసరిం చాలా వద్దా అన్న మీమాంస కాళి, పొన్నల మధ్య, ఆ ఇద్దరి కుటుంబాల నడుమా, వారి లోలోపల తీవ్ర మానసిక సంఘర్షణ రేపుతుంది. సంతాన లేమికి కారణం కాళిలో ఉందని భావిస్తారు. దానికి రుజువులేమీ లేవు. ఆ సంఘర్షణను అత్యంత సున్ని తంగా చిత్రించాడు రచయిత.



భూస్వామ్య సమాజ భావజాల సంక్లిష్టతలను వాటికి వాస్తవికతను, పాటించి, కళాత్మ కతను జోడించి అద్భుతంగా చిత్రించాడు. సమాజం లోని భావజాల వత్తిళ్లు, వ్యక్తుల్ని కుటుంబాలను ఎలా పీడిస్తాయో మనకర్థ మవుతాయి. పొన్న అత్త, కాళి తల్లి తండ్రి, పొన్న సోదరుడు ఆ పద్నాల్గవ రోజు ఉత్సవానికి పొన్నను పంపుతారు. పొన్న సోదరుడు కాళిని ఒక కొబ్బరి తోటకు తీసుకుపోయి తాగించి మైకంలో ఉంచుతా డు. రథోత్సవంలో పొన్న సంగమంలో పాల్గొందా లేదా అన్నదాన్ని రచయిత చిత్రించలేదు. కాళీ మైకం నుండి బయటపడిన తర్వాత భార్య పొన్న తనను మోసం చేసిందని కుప్పకూలుతాడు. దీనితో నవల ముగుస్తుంది.



ఈ చిత్రణ హిందూమత వ్యతిరేకమై నదన్న వాదనతో నవలను నిషేధించాలని, రచయి తను అరెస్టు చేయాలని హిందూత్వశక్తులు అల్లరి చేశాయి. సకల విషయాలకీ మానవుడే ప్రమాణం అన్నదే మానవీయ జీవన తాత్వికత. రచయిత సృజనాత్మక స్వేచ్ఛ, మానవ స్వేచ్ఛకు ప్రగతికి అంకితమైనంత కాలమూ ఉత్తమ సాహిత్యం వెలువడుతూనే ఉంటుంది. ఎన్ని వత్తిడులు వచ్చినా పెరుమాళ్ మురుగన్ కలం ఆగిపోదనే ఆశిద్దాం. ఆయనకు సంఘీభావంగా నిలుద్దాం.



డా॥బి. సూర్యసాగర్  జనసాహితి

మొబైల్ : 94411 46694

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top