కొత్త అమరావతి కొలిచే దైవం

కొత్త అమరావతి కొలిచే దైవం - Sakshi


ఏబీకే ప్రసాద్

 సీనియర్ సంపాదకులు

 

 భూసేకరణ పథకం నిబంధనల కింద (రూల్-7) తమ తమ పంటభూములను చట్టం పరిధి నుంచి మినహాయించాలని కోరడానికీ, తమ వ్యతిరేకతను వ్యక్తం చే యడానికీ  రైతులకు హక్కు ఉంది. తమ అభ్యంతరాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు రైతులకు ఉందని నిబంధనలోని 6(2)(ఐ) కూడా పేర్కొంటున్నది. ప్రభుత్వ భూసమీకరణ ప్రక్రియ చట్ట విరుద్ధమనీ, నిరంకుశమనీ, రాజ్యాంగానికీ, పారదర్శకతకూ విరుద్ధమనీ 32 మంది రైతులు వ్యాజ్యాలు నడుపుతున్నారు.

 

 ‘‘అతడి శవపేటికను మూసేసే దాకా ఏ మనిషి మంచిచెడులను గురించి ఒక నిర్ణయానికి రావొద్దు. ముందు ఆ శవపేటికను మూసేయండి! అప్పుడు అతని గురించి ఓ నిర్ణయానికి రండి! ఎందుకంటే, నా శవపేటికను మూసేసే ఆఖరి క్షణాలలో కూడా నేను మూర్ఖుడిలా ఏదో ఒక దౌర్భాగ్యపు పని చేసే అవకాశం ఉంది!’’

 - లీ-కాన్ (ఇటీవల మరణించిన సింగపూర్ నిర్మాత, తొలి ప్రధాని)

 

 నియంతలలో కూడా ‘కారుణ్య’ ప్రభువులు కొందరు ఉంటారని చరి త్రలో చదువుకున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటకాలంలో ప్రజల నాల్కల మీద ఒక పాట నానుతూ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు ఒకటి రెండు పంక్తులు- ‘తమరు చేసే కుట్ర దాచుకోవచ్చునని/ కలిగినోరిచ్చారు బొచ్చా, దాన్ని కలవారి ఇళ్లకే తెచ్చా!’ అని. లోకంలో పైకి కనిపించే ‘కారుణ్య’ పాలకుల తంతు కూడా అంతే. అసలు విపక్షమే వద్దనీ, ఏకపక్ష పాలనే ముద్దనీ, పత్రికాస్వేచ్ఛను వీలైతే బాహాటంగానూ, వీలు కానప్పుడు దొడ్డి దారిన నియంత్రించడం అవసరమనీ, ఎగ్జిక్యూటివ్ స్థాయి జీతాలు ఇచ్చి రాజకీయవేత్తలని నోరెత్తకుండా చేయడం సాధ్యమనీ, ఇదంతా చేయాలంటే ఏకపక్ష పాలనే సరైందనీ నమ్మినవాడు సింగపూర్ నియంత లీ కాన్. అందుకే బీజేపీ నాయకుడు, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకీ, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకీ లీ కాన్ బాగా నచ్చి ఉంటాడు. అధికారపక్షం మీద మొహం మొత్తిన  ప్రతిసారి ఊదరతో ప్రజల ప్రతికూల ఓటును  ఆకర్షించి అధికార పగ్గాలు చేపట్టాలని చూసే రాజకీయులంతా ఇదే కోవకు చెందుతారు. ఇలాంటి వాళ్లే రాజకీయాలలోనూ, పాలనా వ్యవస్థ లోనూ వింత వింత సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు, విదేశీ పెట్టుబడులను స్వదేశీ ప్రైవేటు పారిశ్రామికవేత్తల అరకొర పెట్టుబడులతో అనుసంధానించి రాజ్యాంగ నిబంధనలను లెక్కపెట్టకుండా ప్రభుత్వ రథాన్ని డొల్లిస్తున్నారు.  

 

 గుత్త పెట్టుబడిదారుల మేలుకే ఇదంతా

 

 యూపీఏ సంకీర్ణం కూలిపోక ముందు 2013లో భూసేకరణ చట్టాన్ని ప్రవేశ పెట్టారు. అప్పటిదాకా తమ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకు పరిహారంగానే ఈ చట్టాన్ని ముందుకు నెట్టవలసి వచ్చింది. తొలి ప్రధాని పం డిట్ నెహ్రూ ప్రవేశపెట్టిన భూసంస్కరణల చట్టానికి రక్షణగా రాజ్యాంగం లోని 31-బి అధికరణకు పదును అలా పెట్టక తప్పలేదు. నిజానికి నెహ్రూ తరువాతి పాలకులంతా 9వ షెడ్యూల్‌లోకి అమాంబాపతు చట్టాలను చొప్పించి, భూసంస్కరణల స్ఫూర్తిని నీరుగార్చారు. ఇంతకీ 2013 లోనే భూసేకరణ/సమీకరణ చట్టానికి రూపకల్పన జరిగింది. దీని ప్రధాన లక్ష్యం ఏమిటి? రైతాంగానికీ, పర్యావరణానికీ, సేద్యం మీద ఆధారపడే వ్యవసాయ కార్మికులకూ, వ్యవసాయాధారిత చేతివృత్తులకూ నష్టం కలగకుండా పంట భూములను మినహాయించి పరిశ్రమలకు ఇతర ఉపాంగాలకు భూసేకరణ చేయడమే. అదీకాక, ఈ చట్టాన్ని అమలు చేసే ముందు సమాజం మీద ఆచర ణలో దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పే అంచనా నివేదికను తప్పని సరిగా రూపొందించాలని కూడా 2013 చట్టం పేర్కొంటున్నది. కానీ చట్టం ప్రధాన లక్ష్యానికి తూట్లు పొడుస్తూ మోదీ, చంద్రబాబుల ప్రభుత్వాలు ముం దుకు సాగుతున్నాయి. గుత్త పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాల రక్షణకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడుతున్నాయి. లోక్‌సభలోనూ, ఇక్కడ శాసనసభలోనూ తమకు ఉన్న బ్రూట్ మెజారిటీతో ప్రభుత్వాలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని నిశ్చయంగా చెప్పవచ్చు. లోక్‌సభలో ఆధిక్యం లేనందున భూసేకరణ/ సమీకరణ కోసం ప్రవేశపెట్టదలచిన సరికొత్త బిల్లును ఆర్డినెన్స్ రూపంలో దేశం మీద రుద్దడానికి ప్రయత్నించారు. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వల్లనే, ఈ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసే లోగా (ఏప్రిల్ 5) మళ్లీ పునరుద్ధరించాలని ఎన్డీయే తాపత్రయ పడు తోంది. కానీ చంద్రబాబుకు శాసనమండలి అభిప్రాయంతో పనిలేకపోవ డంతో శాసనసభలో మెజారిటీ ద్వారా భూసేకరణ బిల్లును ఆమోదింపచేసు కుని చట్టరూపం ఇవ్వగలిగారు. ఇక్కడితో ఆగకుండా  విజయవాడ కేంద్రంగా (ఇప్పుడు గుంటూరు- విజయవాడల మధ్య అమరావతి కేంద్రంగా) రాజ ధానిని నిర్మించడం కోసం రకరకాల పద్ధతుల ద్వారా 30,000 ఎకరాలను సేకరించడం కోసం ఏతాం ఎత్తారు మన పాలకులు. నిజానికి చండీగడ్ (పంజాబ్-హర్యానా), రాయపూర్ (ఛత్తీస్‌గడ్) అనే రెండు రాజధానుల నిర్మాణానికి మూడువేల ఎకరాలు సరిపోయాయి. అందుకే ఈ భారీ భూసేక రణ తీరుకు నిపుణులు విస్తుపోతూ, వ్యతిరేకిస్తున్నారు. సమీకరణ ప్రక్రియ లోని సామంజస్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

 రైతుల ఇష్టానికి ఏదీ విలువ?

 

 వీటి తరువాత పరిణామం- రాజధాని నిర్మాణ ‘ప్రాధికార సంస్థ’ ఏర్పాటు చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం, దాని నిబంధనలు, అవి రాజధాని ప్రాంత పేద, మధ్య తరగతి రైతాంగ బాహుళ్యం మౌలిక ప్రయోజనాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో, ఫలితంగా ఎంత నష్టం వాటిల్లుతు న్నదో గణించకుండా ఆ చట్టాన్ని రుద్దడానికి పాలకులు ప్రయత్నించారు. ఈ చట్టం అమలు కోసం పంట భూములను ధ్వంసం చేసి బెదిరించే ప్రయత్నం జరిగిందని కూడా వార్తలను బట్టి తెలుస్తున్నది. ఇదే సమయంలో ఈ చట్టం లోపాలనూ, నిబంధనలలోని లొసుగులను ఎండగడుతూ  రైతులూ, వారి న్యాయవాదులూ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. అసలు లోపం ఎక్కడున్నదో చూపించారు. పాలకులు చట్టం గురించి చెబుతున్న మాటకీ, ఆచరణలో దాని ఫలితాలకూ ఎంతమాత్రం పొంతన కుదరని వాస్త వాన్ని కూడా రూఢీ చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన సీఆర్‌డీఏ చట్టం తొమ్మిదో అధ్యాయంలోని 52వ సెక్షన్ స్పష్టంగా ఇలా చెబుతోంది, ‘‘రైతుల నుంచి వారి ఇష్టం మేరకు మాత్రమే భూములను తీసుకోవడం ఈ భూసేకరణ చట్టం ఉద్దేశం.’’ కానీ ఆచరణలో అధికారులు, పాలకులు ఇం దుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. రంగంలోకి దిగి భూసేకరణ జరి పారు. 2015 చట్టం ప్రకారం భూసేకరణ పథకం నిబంధనల కింద (రూల్-7) తమ తమ పంట భూములను చట్టం పరిధి నుంచి మినహాయిం చాలని కోరడానికీ, తమ వ్యతిరేకతను వ్యక్తం చే యడానికీ  రైతులకు  హక్కు ఉంది. తమ అభ్యంతరాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు రైతులకు ఉందని నిబంధనలోని 6(2)(ఐ) కూడా పేర్కొంటున్నది. ప్రభుత్వ భూసమీకరణ ప్రక్రియ చట్ట విరుద్ధమనీ, నిరంకుశమనీ, రాజ్యాంగానికీ, పారదర్శకతకూ విరుద్ధమనీ 32 మంది రైతులు వ్యాజ్యాలు నడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వాఙ్మూలాలు వారు సమర్పించారు. మరో 22 మంది రైతులు కూడా కోర్టును ఆశ్రయించనున్నారు.

 

 మట్టివాసనే మాకు ప్రియం

 

 రైతుల ఆవేదన, ఆక్రోశం ప్రాధికార సంస్థ ఉనికిలోకి రాకముందు నుంచే చుట్టుపట్ల ప్రస్ఫుటమైందన్న సంగతిని కూడా మరచిపోరాదు. ‘భూములు ఇస్తే మీ జీవనం ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాల మధ్య హాయిగా సాగుతుం ద’ని రైతులను మభ్యపెట్టారు. ఇందుకు రైతాంగం ఇస్తున్న సమాధానం- ‘మీరు ఎయిర్ కండిషనింగ్‌తో కల్పించే సౌకర్యం కన్నా, ఎండలోనే ఉంటూ దైవసమానమైన మట్టివాసనల మధ్యనే బతకడం మాకు ఇష్టం!’. అని. ఉన్న కాస్త కొండ్రనూ ధారాదత్తం చేయలేమని వారు చెబుతున్నారు. రైతుల ఈ ఆవేదననూ, మట్టితో వారికి ఉన్న అనుబంధం గురించి రిట్‌ల ద్వారా ఉన్నత న్యాయస్థానానికి వినిపిస్తున్నవారే సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధా కరరెడ్డి. ఆదిలో ప్రభుత్వం నోటిఫికేషన్  (1-1-2015) ఇస్తూ భూసేకరణ చట్టం ప్రకారం 15 రోజుల లోగా భూములు ఇవ్వ నిరాకరించే సందర్భంలో అందుకు కారణాలనూ, అభ్యంతరాలనూ తెలియచేసుకోవచ్చునని నిర్దేశిం చింది. కానీ ఈ రోజుకీ అది అమలు కాలేదు.

 

 మూడు మాసాలు గడచిపో యినా చట్టంలోని 7వ నిబంధన ప్రకారం రైతుల అభ్యంతరాల మీద ఎలాం టి ఉత్తర్వులనూ ప్రభుత్వం జారీ చేయలేదని తమ పిటిషన్‌లో రైతులు ఆరో పిస్తున్నారు. ఇంకా రైతులలో భయాందోళనలను నింపిన అర్ధరాత్రి పంట పొలాల ధ్వంసం (29-12-2014) కేసులో అసలు నేరగాళ్లను పట్టుకోకుండా అమాయకులను వేధించడం సర్కారీ నాటకంలో కొత్త అంకం. ఇంతకు ముందే యూపీఏ ఇచ్చిన ఆర్డినెన్స్‌లో పేర్కొన్నట్టు భూసమీకరణకు 70 శాతం రైతాంగం సమ్మతి తప్పక అవసరం. ఇప్పుడు ఆ శాతాన్ని గణనీయం గా కుదిస్తూ రేపోమాపో ఎన్డీయే ప్రభుత్వం సవరణ తేబోతున్నది. తద్వారా పార్లమెంటును జోకొట్టి ప్రభుత్వం తమ భూసేకరణ చట్టం విషయంలో తమ పంతం నెగ్గించుకోవాలని అనుకుంటోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ దావే చెప్పినట్టు (30-3-2015) భూసంస్కరణ చట్టాలను సక్రమంగా అమలు జరపకపోవడం వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని ప్రజలు భూమిపై హక్కులు లేక తమ సర్వస్వాన్నీ కోల్పోతారు. అంటే,  మోప్లా వంటి గత రైతాంగ తిరుగుబాట్లకు కారణాలని ఆధునిక కాలంలో దాల్వే చెప్పకనే చెప్పారు. బహుపరాక్.

 (వ్యాసకర్త మొబైల్: 9848318414)


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top